l తెలంగాణభవన్లో మంగళవారం ప్రత్యేక పూజలు
l మిర్యాలగూడ నుంచి ప్రారంభం.. సిద్ధిపేటలో ముగింపు
l రాష్ట్రవ్యాప్తంగా 17 రోజులు పాటు సాగనున్న యాత్ర
l బస్సుయాత్ర కోసం ట్రైలర్ విడుదల
హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనంలోకి రానున్నారు. ఇన్నాళ్లుగా బహిరంగ సభలతోనే సరిపెట్టిన ఆయన రోజురోజుకు ప్రభావం తగ్గిపోతున్న పార్టీలో ఉత్సాహం నింపేందుకు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. నేటి నుంచి ఈ యాత్ర మిర్యాలగూడ నుంచి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ యాత్ర కొనసాగించబోయే బస్సుకు తెలంగాణ భవన్లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి నుంచి 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లు చేసింది.
మిర్యాలగూడలో ప్రారంభమై సిద్ధిపేటలో జరిగే బహిరంగ సభతో బస్సుయాత్ర ముగిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయమే లక్ష్యంగా గులాబీ బాసు యాత్ర చేపడుతున్నారు. దాదాపు ప్రతి పార్లమెంటు సెగ్మెంట్ను కలిపేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. తమ నియోజకవర్గాల్లోనూ బస్సుయాత్ర నిర్వహించాలంటూ పలు నియోజకవర్గాల నేతల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ప్రచారానికి సమయం తక్కువగా ఉండటం, అధిక ఎండల కారణంగా కొన్ని నియోజకవర్గాల్లోనే బస్సుయాత్ర చేయాలని నిర్ణయించారు. కేసీఆర్ యాత్ర పొడువునా 100 మందికిపైగా వాలంటీర్లు వాహన శ్రేణి వెంట రానున్నారు.
ఇప్పటికే ఎంపికైనవారికి రెండు రోజుల క్రితం అవగాహన కల్పించారు. తొలిరోజు ముందుగా కేసీఆర్ పార్టీ కార్యాలయానికి చేరుకుని, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించి పార్టీ క్యాడర్తో సమావేశమైతారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట తరువాత నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో తొలి రోడ్షోలో పాల్గొనేందుకు బయలుదేరుతారు.
వైరల్ అవుతోన్న ట్రైలర్
కేసీఆర్ బస్సుయాత్ర సందర్భంగా ఓ ట్రైలర్ కూడా విడుదల చేశారు. తెలంగాణ గళం.. తెలంగాణ దళం.. అంటూ సాగే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటు, పంటలకు గిట్టుబాటు ధర, తాగునీటి కోసం జనం పడుతున్న బాధలపై చేసిన ప్రసంగం పలువురిని ఆకట్టుకుంటోంది. బీఆర్ఎస్ పాలనలో ఏవిధంగా తెలంగాణ పచ్చదనంగా ఉందో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తరువాత మళ్లీ కరువు విలయ తాండవం చేస్తుందని చెప్పిన మాటలు తెలంగాణ సమాజాన్ని ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఓ పాటను కూడా విడుదల చేశారు. గడప గడపలోనా నీపేరు రాసుకున్నవే.. కడుపుల పెట్టుకోని మమ్ముల చూసుకున్నవే.. మాకెంత గోస వచ్చే ఏదోటి చేయవే.. అమ్మలాంటి ఆలన నీది ఆయ్యా కేసీఆర్.. నమ్మలేకపోతుంది నీ పాలన లేదంటే ఊరు అంటూ ఈ పాట సాగుతుంది.
బస్సు యాత్ర వివరాలు
ఏప్రిల్ 24:
మిర్యాలగూడలో
సాయంత్రం 5.30 గంటలకు రోడ్ షో
సూర్యాపేటలో
సాయంత్రం 7 గంటలకు రోడ్ షో
ఆ రోజు రాత్రి సూర్యపేటలోనే బస
ఏప్రిల్ 25
భువనగిరిలో
సాయంత్రం 6 గంటలకు రోడ్ షో
ఆ రోజు రాత్రి ఎర్రవల్లిలోని
కేసీఆర్ ఫాం హౌస్లో బస
ఏప్రిల్ 26
మహబూబ్నగర్లో
సాయంత్రం 6 గంటలకు రోడ్ షో
రాత్రి మహబూబ్నగర్లోనే బస
ఏప్రిల్ 27
నాగర్ కర్నూల్లో
సాయంత్రం 6 గంటలకు రోడ్ షో
ఏప్రిల్ 28
వరంగల్లో
సాయంత్రం 6 గంటలకు రోడ్ షో
రాత్రి అక్కడే బస
ఏప్రిల్ 29
ఖమ్మంలో
సాయంత్రం 6 గంటలకు రోడ్ షో
రాత్రి అక్కడే బస
ఏప్రిల్ 30
తల్లాడలో
సాయంత్రం 5.30 గంటలకు రోడ్ షో
కొత్తగూడెంలో
సాయంత్రం 6.30 గంటలకు రోడ్ షో
మే 1
మాహబూబాబాద్లో
సాయంత్రం 6 గంటలకు రోడ్ షో
రాత్రి వరంగల్లో బస
మే 2
రామగుండంలో
సాయంత్రం 6 గంటలకు రోడ్ షో
రాత్రి రామగుండంలోనే బస
మే 4
మంచిర్యాలలో
సాయంత్రం 6 గంటలకు రోడ్ షో
రాత్రి కరీంనగర్లో బస
మే 5
జగిత్యాలలో
సాయంత్రం 6 గంటలకు రోడ్ షో
రాత్రి అక్కడే బస
మే 6
నిజామాబాద్లో
సాయంత్రం 6 గంటలకు రోడ్ షో
రాత్రి అక్కడే బస
మే 7
కామారెడ్డిలో
సాయంత్రం 5.30 గంటలకు రోడ్ షో
సాయంత్రం 7 గంటలకు
మెదక్లో రోడ్ షో
రాత్రి మెదక్లోనే బస
మే 8
నర్సాపూర్లో
సాయంత్రం 5.30 గంటలకు రోడ్ షో
పటాన్చెరువులో
సాయంత్రం 7 గంటలకు రోడ్ షో
రాత్రి ఎర్రవెల్లిలో బస
మే 9
కరీంనగర్లో
సాయంత్రం 6 గంటలకు రోడ్ షో
రాత్రి కరీంనగర్లోనే బస
మే 10
సిరిసిల్లలో
సాయంత్రం 5 గంటలకు రోడ్ షో
సిద్ధిపేటలో
సాయంత్రం 6.30 గంటలకు రోడ్ షో
అనంతరం హైదరాబాద్లోని నందినగర్ ఇంటికి చేరుకుంటారు. ఇక్కడితో 17 రోజుల యాత్ర పూర్తవుతుంది.