20-09-2025 11:07:19 PM
కుభీర్: నిర్మల్ జిల్లా కుభీర్ మండలానికి చెందిన పల్సి గ్రామానికి చెందిన కుబ్రే నర్సవ్వ-హన్మాండ్లు కూతురైన అపర్ణ అనే విద్యార్థిని నీట్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించి, వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలోMBBS సీటును పొందింది. MBBS కు ఎంపికైన గ్రామానికి చెందిన మొట్ట మొదటి విద్యార్థిని కావడం విశేషం. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయాన్ని చేస్తూ దాన్ని నమ్ముకుని జీవించే రైతు కుటుంబం.
తన గ్రామం నుండి మెడికల్ సీటు సాధించిన మొదటి విద్యార్థిని అపర్ణను ఉపాధ్యాయులు, గ్రామస్తులు, శనివారం ఘనంగా సన్మానించారు. నాలుగో తరగతి వరకు పల్సి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, ఐదు నుండి ఇంటర్ వరకు ఇచ్చోడాలోని ప్రభుత్వ గురుకుల బాలికల పాఠశాలలో చదివి పట్టుదల, కృషి, అంకితభావంతో గ్రామీణ నేపథ్యం నుండి వచ్చి, పట్టణ స్థాయి విద్యార్థులతో పోటీ పడి ఈ విజయం సాధించడం అపర్ణ కృషికి నిదర్శనం. గ్రామంలోని ఇతర విద్యార్థులకు ఒక గొప్ప ప్రేరణగా నిలిచిందని ఆమె సాధించిన విజయానికి స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఆమెను శాలువాలతో సత్కరిస్తూ అభినందించారు.