19-12-2025 12:12:12 AM
భద్రాచలం, డిసెంబర్ 18 (విజయక్రాంతి): భద్రాచలం గోదావరి వంతెన వద్ద గురువారం ఉదయం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గురువారం సజ్జ రవివర్మపై భౌతిక దాడికి పాల్పడి హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని బంధువులు భద్రాచలం - సారపాక వెళ్లే వంతెన ముందు బైఠాయించారు. మాకు న్యాయం చేయండి మహాప్రభో... గంజాయి మూకల ఆగడాలు అరికట్టాలి... హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి... అంటూ నినాదాలు చేశారు.
పరిస్థితిని కుదుటపరిచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. కాగా భద్రాచలం ఎమ్మెల్యే డా.వెంకట్రావు సంఘటన జరిగే నిరసన ప్రదేశానికి చేరుకొని బాధిత రవి వర్మ కుటుంబ సభ్యులను ఓదార్చారు. నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడేందుకు ప్రయత్నిస్తానని, కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున తగు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో రవివర్మ కుటుంబ సభ్యులు నిరసనను విరమించారు.
అయితే గురువారం జరిగిన దాడిలో గాయపడిన వారు నిందితులకు శిక్ష వేయించాలన్న డిమాండ్ తో ఒంటి మీద పెట్రోల్ పోసుకోవడం కొంత ఆందోళనానికి గురి చేసింది. కాగా పరిస్థితిని పోలీసులు అదుపు చేశారు. దీంతో భద్రాచలం వైపు, సారపాక వైపు బ్రిడ్జిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వివిధ ప్రదేశాల నుండి వచ్చిన ప్రయాణికులు వారి వాహనాలను వదిలి నడక ద్వారా భద్రాచలం చేరుకునే పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమంలో మృతుని బంధువులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.