26-01-2026 12:01:08 AM
ఆలేరు, జనవరి 25: యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగం గ్రామ పరిధిలోని వ్యవసాయ బావి వద్ద పులి సంచారం ఆదివారం కలకలం రేపింది. పులి దాడి చేసి ఓ దూడను చంపి రక్తం పీల్చివేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు,
ఈ సందర్భంగా బాధిత రైతును ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అటవీ శాఖ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసి పులి జాడను గుర్తించాలని తెలిపారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, పశువులను రాత్రి వేళల్లో సురక్షితంగా ఉంచుకోవాలని, చీకటి పడే లోపు గ్రామంలో కి రైతులు చేరుకోవాలన్నారు, అటవీ శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. ఇరవెంట పలువురు గ్రామస్తులు ఉన్నారు.