01-12-2025 07:02:33 PM
జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారికి ఐద్వా నాయకుల వినతి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కాగజ్నగర్ మండలంలోని ఇస్గాం–నజ్రుల్ నగర్ పరిధిలో ప్రతిపాదించిన వైన్షాపును గ్రామానికి కనీసం 500 మీటర్లు దూరంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు వినోద, నాయకులు షాహినీ, సుచిత్ర మాట్లాడుతూ.. నజ్రుల్ నగర్ గ్రామపంచాయతీకి కేటాయించిన వైన్షాపును గతంలో పెంచికలపేట మెయిన్ రోడ్డులోని పంచశీల నగర్ వద్ద ఏర్పాటు చేశారని, అయితే ఈ సంవత్సరం ఆ దుకాణాన్ని మరింత ముందుకు జరిపి ఇండ్ల మధ్యలో ఏర్పాటు చేయడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.
ఇళ్ల మధ్యలో వైన్ షాపు ఏర్పాటు చేస్తే, అక్కడి మహిళలకు, విద్యార్థులకు, ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని తెలిపారు. సాయంత్రం సమయంలో జనసంచారం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో మందుబాబుల ప్రవర్తన వలన మహిళలు, విద్యార్థులు అసభ్యకర పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వైన్షాపును నజ్రుల్ నగర్ గ్రామానికి 500 మీటర్లు దూరంగా, నామనగర్ వెళ్లే మార్గంలో ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు సుచిత్ర రానా, మమత రానా తదితరులు పాల్గొన్నారు.