02-08-2025 02:22:54 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాల యాల్లో తిష్టవేసిన అవినీతి తిమింగలాల భరతం పట్టేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తన దూకుడును కొనసాగిస్తోంది. ఈ ఏడాది జూలైకు సంబంధించిన నివేదికను ఏసీబీ విడుదల చేసింది. ఈ ఒక్క నెలలోనే రాష్ర్టవ్యాప్తంగా 22 కేసులు నమోదు చేసి, సుమారు రూ.11.5 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించినట్టు పేర్కొంది.
ఈ 22 కేసు ల్లో లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులు 13, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు 1, క్రిమినల్ మిస్ కండక్ట్ కేసు 1, సాధారణ విచారణ 1, ఆకస్మిక తనిఖీలు 6 ఉన్నా యి. లం చం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు ఔట్సోర్సింగ్ సిబ్బందితో సహా మొత్తం 20 మంది ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. లంచం గా స్వీకరించిన రూ. 5.75 లక్షల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఒకే ఒక్క ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏకంగా రూ.11.5 కోట్లు విలువైన అక్రమ ఆ స్తులను గుర్తించి, వాటిని అటాచ్ చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఆర్టీఏ చెక్ పోస్టులు, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలపై జరిపిన ఆకస్మిక తనిఖీల్లో లెక్కలు చూపని రూ.1,49,880 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఏడు నెలల నివేదిక
ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 148 కేసులు నమోదయ్యాయి. 145 మంది ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మొత్తం రూ. 30.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 9 అక్రమాస్తుల కేసుల్లో ఏకంగా రూ. 39.16 కోట్లు విలువైన ఆస్తులను గుర్తించారు.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు 151 కేసులకు సంబంధించిన తుది నివేదికలను ప్రభుత్వానికి పంపి, అవినీతి అధికారులపై శాఖాపరమైన చర్యలకు మార్గం సుగమం చేసినట్లు ఏసీబీ తమ నివేదికలో స్పష్టం చేసింది.