29-09-2025 12:26:24 AM
అమ్మవారిని దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు
నిర్మల్ సెప్టెంబర్ 28(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్రాచీన దేవాలయమైన అడెల్లి పోచమ్మ గంగనీల జాతర ఆదివారం వైభవంగా ముగిసింది. పోచమ్మ నగలను దిల్వాపూర్ మండలం సాన్వి గ్రామం వద్ద గోదావరి జలాలతో అభిషేకం చేసి వివిధ గ్రామాల గుండా అడెల్లి ప్రధాన ఆలయానికి తరలించారు. ఆయా గ్రామాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
గంగనీలు ఇంట్లో, పంట పొలాల్లో చల్లుకుంటే ఆరోగ్యంగా పాడిపంటలు పండుతాయి అని భక్తుల విశ్వాసం. ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జాతరలో అమ్మవారి నగలను స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి మోసి మొక్కు చెల్లించుకున్నారు.