05-07-2025 12:14:59 AM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పలు విత్తనాల దుకాణాల్లో వ్యవసాయ శాఖ , పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు చేపట్టారు. వ్యవసాయ అధికారులు నదీం, రాజలింగంతో పాటు ఎస్సై ఆంజనేయులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు విక్రయించినవారిపై శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
రశీదులు తీసుకోవాలి..
రైతులు ఫర్టిలైజర్ దుకాణాల్లో మందులు తీసుకున్న అనంతరం తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని వ్యవసాయ, పోలీసు శాఖల అధికారులు సూచించారు. ఎరువులు తీసుకున్న తర్వాత రశీదులు తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నారు. విత్తన దుకాణాదారులు సైతం కమీషన్లకు ఆశపడి నాణ్యతలేని వంగడాలను రైతులకు అంటగట్టవద్దని సూచించారు.