10-10-2025 01:38:39 AM
బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు ఎం.నగేష్ ముదిరాజ్
ముషీరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముం దు ఇచ్చిన హామీలన్ని అబద్ధపు హామీలేనని తేలిపోయిందని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు ఎం.నగేష్ ముదిరాజ్ అన్నారు. పెంచిన బస్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అధిష్టానం గురువారం నిర్వహించ తలపెట్టిన చలో బస్ భవన్ కార్యక్రమానికి బిఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు నగేష్ ముదిరాజ్ హాజ రవుతారన్న ముందస్తు సమాచా రం తెలుసుకున్న పోలీసులు రామ్నగర్లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం లోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామనీ చెప్పే కాంగ్రెస్ పెంచిన బస్సు చార్జీల పేరుతో ఉన్న ఒక్క పథకాన్ని నీరుగార్చారన్నారు. ఆర్టీసీకి 6000 కోట్ల అప్పు ఉందని, దమ్ముంటే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్, సీఎం రేవంత్ వద్ద నుంచి నిధులు తీసుకురావాలన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీలో ఉన్న కార్మికులకు కెసిఆర్ సీఎం ఉన్న సమయంలో 44% ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత బిఆర్ఎస్ దేనని అన్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు కాదు, అబద్దాల గ్యారేంటి లని, ఆర్టీసీ చార్జీ పెంపుదల ఒక చేయితో ఇచ్చి మరో చేయితో అడుక్కున్నట్టుందన్నారు. ఇంట్లో మహిళలకు ఛార్జీలు లేకుండా ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చెబుతూ అదే ఇంట్లో ఉన్న మగవారందరికీ రెండింతల చార్జీలు పెంచడం దారుణమన్నారు. వెంటనే బస్ చార్జీలను తగ్గించాలని నాగేష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.