25-06-2025 12:00:00 AM
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో, మోడల్ స్కూల్స్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి, పరీక్షల నిర్వహణ- నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేశారు. గత ఏడాది డీఎస్సీ నిర్వహణ సమయంలోనే మరో 5 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ ఇస్తామని పేర్కొన్నారు.
వివిధ రకాల సమస్యలవల్ల జాబ్ క్యాలెండర్ వాయిదా పడిన విషయం తెలిసిందే. గత డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు సంవత్సరం అవుతున్నది. కాబట్టి, పదవీ విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలు క్లియర్ వెకెన్సీలు కలిపి దాదాపు 10 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెట్ పరీక్షలు కూడా పూర్తి కాబోతున్నాయి. కనుక, త్వరగా డీఎస్సీపై నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
అలాగే, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగిన మోడల్ స్కూల్ ఖాళీల భర్తీ తర్వాత ఇంతవరకు మళ్ళీ నోటిఫికేషన్ జారీ కాలేదు. మోడల్ స్కూల్స్లో ప్రమోషన్స్, బదిలీల ప్రక్రియలు కూడా త్వరలో పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి, దాదాపు 2 వేల టీచర్ పోస్టులు ఖాళీలు ఉండే అవకాశం ఉంది.
డీఎస్సీతోపాటు మోడల్ స్కూల్స్ ఖాళీలకు నోటిఫికేషన్స్ కూడా ఇస్తే ఇటు నిరుద్యోగులకు న్యాయంతోపాటు అటు ప్రభుత్వ పాఠశాలల మోడల్ స్కూల్స్ విద్యార్థులకు మరింత మంది టీచర్లు అందుబాటులోకి వస్తారు. కాబట్టి, ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి.
రావుల రామ్మోహన్రెడ్డి