30-01-2026 01:08:25 AM
మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్, జనవరి 29 (విజయక్రాంతి): కాంగ్రెస్ చెప్పిన 420 మోసాలను గల్లి గల్లికి తీసుకెళ్లి...బీఆర్ఎస్ చేసిన సంక్షేమ పథకాలను వివరించాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం భారత రాష్ట్ర సమితి క్యాంపు కార్యయంలో మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ ల వారీగా పార్టీ నాయకులు.. కార్యకర్తలతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన వా రికీ..గెలిచే అభ్యర్థులకు మాత్రమే టికెట్ వస్తుందని..టికెట్ రాలేదని ఎవరు నిరాశ చెందవద్దని కోరారు. భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పుడు మంచి స్థానం కల్పిస్తామన్నారు.
మున్సిపల్ ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించేందుకు కష్టపడి పని చేయాలన్నారు. మహబూబ్ నగర్ పురపాలికలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మోసాలు గల్లి గల్లీకి తీసుకెళ్లాలని అన్నారు. బూత్ స్ధాయి నుంచి మున్సిపల్ స్ధాయి వరకు బలమైన వ్యూహంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పుర ఎన్నికల పరిశీలకులు అలీ మస్కతి, గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు,బీఆర్ఎస్ నేతలు తదితరులు ఉన్నారు.