30-01-2026 12:00:00 AM
* భారత్ వరుస విజయాలకు విశాఖలో బ్రేక్ పడింది. ఫలితంగా ఇప్పుడు అందరి చూపు చివరి టీట్వంటీపైనే నెలకొంది. అందులోనూ తుది జట్టు కూర్పులో సంజూ శాంసన్పైనే అందరి దృష్టి ఉంది. ఈ సిరీస్ ఆద్యంతం వైఫల్యాల బాటలో ఉన్న సంజూ నాలుగో మ్యాచ్లో టచ్లోకి వచ్చినట్టు కనిపించినా పూర్తి స్థాయిలో నిలబెట్టుకోలేదు. టీ20 ప్రపంచకప్ తుది జట్టులో చోటు దక్కాలంటే ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్కు ఇదే చివరి ఛాన్స్.. మరి సొంతగడ్డపై జరిగే చివరి టీ ట్వంటీలోనైనా చెలరేగుతాడా..
తిరువనంతపురం, జనవరి 29 : వన్డే సిరీస్ చేజార్చుకున్నా తాము సూపర్ ఫామ్ లో ఉన్న షార్ట్ ఫార్మాట్లో అదరగొడుతున్న టీమిండియా కివీస్పై సిరీస్ ను గెలిచింది. అయితే హ్యాట్రిక్ విజయాల తర్వాత విశాఖలో ఆ జైత్రయాత్రకు సడన్ బ్రేక్ పడింది. తుది జట్టు ఎంపికలో ప్రయోగాలు, బ్యాటర్ల వైఫల్యంతో పరాజయం తప్పలేదు. ఇప్పుడు చివరి టీ ట్వంటీ మ్యాచ్కు రెడీ అయింది. తిరువనంతపురం వేదికగా శనివారం మ్యాచ్ జరగనుండగా.. అందరి చూపు లోకల్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పైనే ఉంది.
ఎందుకంటే ఈ మ్యాచ్కు ప్రపంచకప్ కు ముందు ఫామ్ అందుకునేందుకు సంజూకు మిగి లిన చివరి అవకాశం. అంతేకాదు తుది జట్టులో చోటు దక్కించుకునేందుకు కూడా ఇదే చివరి ఛాన్స్. ఒకవేళ హోం గ్రౌండ్ లో కూడా సంజూ శాంసన్ ఫెయిలయితే మాత్రం మెగాటోర్నీలో భారత్ ఓపెనింగ్ కాంబినేషన్ మారిపోవడం ఖాయం. తిలక్ వర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్కు ఓపెనర్ గా అవకాశం దక్కొచ్చు. అప్పుడు సంజూ బెంచ్కే పరిమితం కావాల్సిన పరిస్థితి.
దీంతో ఏ విధంగా చూసినా న్యూజిలాండ్తో జరిగే చివరి టీ ట్వంటీ సంజూ శాంసన్కు అగ్నిపరీక్ష లాంటిది. న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో సంజూ శాంసన్ వరుసగా విఫలమవుతూ వస్తున్నా డు. మొదటి టీ20లో 2 ఫోర్లు బాది 10 పరుగులకు అవుటైన సంజూ శాంసన్, రెండో టీ20లో ఓ సిక్సర్ బాదేసి పెవిలియన్కు వెళ్లిపోయాడు. మూడో టీ20లో ఇన్నింగ్స్ తొలి బంతికే క్లీన్ బౌల్ అవగా...విశాఖలో జరిగిన నాలుగో టీ20లో అభిషేక్ శర్మ, ఇన్నింగ్స్ ఓపెన్ చేసి తొలి బంతికే అవుట్ అయ్యాడు.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో సంజూ శాంసన్ తన సత్తా చాటేందుకు ఇదే మంచి అవకాశంగా ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. 15 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్తో 24 పరుగులు చేసి క్లీన్ బౌల్ అయ్యాడు. మంచి ఆరంభం దక్కినా దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు. దీంతో మరోసారి సంజూ శాంసన్ ప్లేస్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. టీ20 వరల్ కప్ టోర్నీకి ముందు ఒకే మ్యాచ్ మిగిలి ఉండడంతో ఇప్పటికిప్పుడు టీమ్లో మార్పులు చేయకపోవచ్చు.
కానీ టీమ్లో స్థిరమైన చోటు దక్కించుకోవడానికి సంజూ శాంసన్కు వచ్చిన సువర్ణావకాశం ఇది. దీన్ని కాపాడుకోవాలంటే ఆఖరి టీ20లో అయినా అదరగొట్టాల్సిందే. ఇక తుది జట్టు విషయానికొస్తే శ్రేయాస్ అయ్యర్కు మరోసారి నిరాశే మిగలనుంది. టీ20 ప్రపంచకప్ జట్టులో భాగంగా ఉన్న ఆటగాళ్లందర్నీ ఆడించాలనే ఉద్దేశంతోనే ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం లేదని కెప్టెన్ సూర్యకుమార్ స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే అ య్యర్ మరోసారి బెంచ్కే పరిమితం కానున్నాడు. నాలుగో టీ20కి దూరమైన ఇషాన్ కిషన్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
వరుసగా రెండు మ్యాచ్లు ఆడిన బుమ్రాకు వర్క్ లోడ్ మేనేజ్మెంట్ల్ భాగంగా విశ్రాంతి ఇవ్వొచ్చు. ఒకవేళ అతన్ని కొనసాగించాలనుకుంటే హర్షిత్ రాణాపై వేటు పడుతుంది. నాలుగో టీ20లో రాణా భారీగా పరుగులిచ్చాడు. అక్షర్ పటేల్ గాయంతో దూరమవడంతో జట్టులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ వరుసగా మూడు మ్యాచ్లు ఆడాడు. గత రెండు మ్యాచ్లు దూరంగా ఉన్న వరుణ్ చక్రవర్తీ.. కుల్దీప్ యాదవ్ స్థానంలో బరిలోకి దిగుతాడు. రవి బిషోయ్ను తప్పించాలనుకుంటే కుల్దీప్ యాద వ్ జట్టులో కొనసాగుతాడు.
మిగిలిన బ్యాటింగ్ కాం బినేషన్లో ఎలాంటి మార్పులు జరిగే చాన్స్ లేదు. అభిషేక్ శర్మ ఓపెనింగ్ ఆడనుండగా.. ఇషాన్ కిషన్ వన్డౌన్లో దిగుతాడు. సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా మళ్లీ ఫామ్లోకి వస్తే తిరుగుండదు. గత మ్యాచ్లో చెలరేగిన దూబేపై అంచనాలు పెరిగాయి. సిరీస్ను 4-1తో ముగించాలని భారత్, మరో విజయం కోసం న్యూజిలాండ్ పట్టుదలగా ఉన్న నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని అంచనా.