14-11-2025 12:00:00 AM
కుల వివక్ష అంటూ కన్నీళ్లు పెట్టుకున్న స్వాములు
ఇరువర్గాలతో చర్చించిన ఏసీపీ, సీఐ
రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలంలో ఘటన
ఇబ్రహీంపట్నం, నవంబర్ 13: అయ్యప్ప మాల ధరించిన స్వాములపై కూడా కుల వివక్ష చూపడం అనేది సిగ్గు చేటని పలువురు మండిపడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామం (దొండగూడ)లో సన్నిధానం ఏర్పాటు చేసుకున్న గోదాల శ్రీనివాస్ రెడ్డి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ గర్భగుడిలో అయ్యప్ప స్వామి పీఠం పెట్టారు.
బుధవారం అదే గ్రామానికి చెందిన ముగ్గురు మాలధారణ స్వాములను గుడిలోకి రానివ్వకుండా అడ్డుకుని ఆలయానికి తాళం వేశారు. దీంతో ఆ స్వాములు చేసేదేమీ లేక గుడి గేట్కు పూజలు నిర్వహించారు. గురువారం ఉద యం కూడా ఆ స్వాములను గుడిలోకి రానివ్వకుండా గుడికి మళ్లీ తాళ్లం వేశారు. అయితే స్వాములందరూ ఒకే గ్రామానికి చెందిన వారైనప్పటికీ కేవలం వేరే కులం అనే నెపంతో ముగ్గురు స్వాములను గుడిలోకి రానివ్వకపోడం చర్చనీయాంశంగా మారింది.
విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, సీఐ మహేందర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలతో మాట్లాడి, విబేధాలు రాకుండా ఉండాలని సూచించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేవిధంగా చూసు కోవాలని వారికి తెలియజేశారు.