14-03-2025 12:04:51 AM
బీజేపీ గోల్కొండ జిల్లా అధ్యక్షుడు ఉమా మహేందర్
రాజేంద్రనగర్ (కార్వాన్) మార్చి 13: గురజాల అరవింద్ కుమార్కు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని పార్టీ గోల్కొండ జిల్లా అధ్యక్షుడు ఉమా మహేందర్ స్పష్టం చేశారు. లంగర్ హౌస్ లోని హనుమాన్ మందిరం సమీపంలో నివసించే అతడు ఇటీవల ఓ నవ వధువును తీసుకెళ్లిన విషయం తెలిసిందే.
అతడికి వివాహమై ఓ కూతురు కూడా ఉంది. ఈ నేపథ్యంలో బిజెపి నాయకులు గురువారం లంగర్ హౌస్ లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గురజాల అరవింద్ కుమార్ కు బిజెపి పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగానే బిజెపిని బదనాం చేస్తున్నాయని ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరవింద్ కుమార్ కు క్రియాశీలక సభ్యత్వం కూడా లేదని స్పష్టం చేశారు. అతడు చేసిన పని ముమ్మాటికీ సిగ్గుచేటేనని, పని సభ్య సమాజం తలదించుకునేలా ఉందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బిజెపి హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కన్వీనర్ అల్వాల ఇంద్రసేనారెడ్డి, శ్రీకాంత్, ఉదయ్ కుమార్ రవీందర్ రెడ్డి, నాగేంద్ర ప్రకాష్ రెడ్డి, పూర్ణ చందర్, ఆంజనేయులు, రాజేష్, అమంచి శ్రీకాంత్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.