06-11-2025 01:17:11 AM
విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం ‘ఆర్యన్’. ప్రవీణ్ కే దర్శకత్వంలో విష్ణు విశాల్ స్టూడియోజ్, శుభ్రా, ఆర్యన్ రమేశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి ముఖ్యపాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా తమిళ్లో విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్రెడ్డి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
తెలుగులో నవంబర్ 7న విడుదల కానున్న సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో హీరో విష్ణు విశాల్ మాట్లాడుతూ.. “ఇలాంటి సినిమా చేయడం చాలా చాలెంజింగ్. తప్పకుండా ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెట్టే అనుభూతిని ఇస్తుంది” అన్నారు. ‘ఈ సినిమా ఆలోచన 10 ఏళ్ల క్రితం వచ్చినప్పుడే దీన్ని తెలుగులో చేయాలనుకున్నా. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు ఇలాంటి కొత్త ఆలోచనలు ఆదరిస్తార’ని డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ.. “డాకు మహారాజ్’ తర్వాత మళ్లీ ప్రేక్షకులను కలవడం చాలా ఆనందంగా ఉంది.
ఇందులో జర్నలిస్ట్ పాత్రలో నటించాను. అందరూ సినిమాని థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నా” అన్నారు. ‘ఈ సినిమా చాలా అందంగా ఉంటుంది. నేను ఇందులో చేసిన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంద’ని కథానాయకి మానస తెలిపింది. ఇంకా ఈ కార్యక్రమంలో డీవోపీ హరీశ్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.