07-05-2025 12:07:35 AM
-ప్రజల నుంచి విశేష స్పందన
-వ్యాధిని ముందుగా గుర్తించడం ముఖ్యమంటున్న వైద్యులు
హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేర్ హాస్పిటల్స్, ముషీరాబాద్ ఆధ్వర్యంలో ఉచిత ఆస్తమా అవగాహన, పరీక్ష శిబిరం నిర్వహించారు. ‘ప్రతీక్షణం స్వేచ్ఛగా ఊపిరి తీసుకోండి’ అనే నినాదంతో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
శిబిరంలో 80 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. వీరికి పల్మనాలజీ వైద్యులు ఉచితంగా ఊపిరితిత్తుల పరీక్షలు చేశారు. అలాగే, ఆస్తమా లక్షణాలను ఎలా గుర్తించాలో, దాని కారణాలు ఏమిటో, మందులను ఎలా వాడాలో తెలిపారు. ఈ సందర్భంగా కేర్ హాస్పిటల్స్ సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ అబ్దుల్ అలీం మాట్లాడుతూ.. ‘చాలామందికి తమకు ఆస్తమా ఉందన్న విషయం కూడా తెలియదు. కొంతమంది ఇన్హేలర్ను సరైన విధంగా ఉపయోగించటం లేదు.
ఈ శిబిరం ద్వారా వారికి సరైన సమాచారం ఇవ్వగలిగాం’ అని పేర్కొన్నారు. ముషీరాబాద్ కేర్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ భారతి మాట్లాడుతూ ఇలాంటి అవగాహనా సదస్సులు, ఉచిత ఆరోగ్య శిబిరాలు ప్రజల్లో ఉన్న భయాలను తగ్గించి, వారు త్వరగా వైద్యం చేయించుకునేలా ప్రోత్సహియస్తాయని చెప్పారు. కేర్ హాస్పిటల్స్ ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ, శ్వాస సమస్యలున్నవారికి సరైన సమయానికి చికిత్స అందేలా ప్రయత్నిస్తోందని తెలిపారు.