18-09-2025 12:38:43 AM
ముగ్గురు రైతులకు తీవ్ర గాయాలు
మహబూబాబాద్, సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి): ఆటోలో యూరియా బస్తాల కోసం వెళ్తుండగా పల్టీ కొట్టడంతో ముగ్గురు రైతుల తీవ్రంగా గాయపడ్డ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కంబాలపల్లి వద్ద బుధవారం జరిగింది. మండలంలోని గొరిమిళ్ళ గ్రామానికి చెందిన బోడ లక్ష్మి, వజ్జ సూరమ్మ, బోడ కిషన్తో పాటు మరికొందరు ఆటోలో ఉప్పలపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా టోకెన్ల కోసం వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటో కంబాలపల్లి శివారు చిన్నవాగు సమీపంలో ఫల్టీ కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మి, సూరమ్మ, కిషన్తో పాటు మరికొందరిని మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
బాధితుల ఇంటికి యూరియా పంపిణీ
గురిమెళ్ళ గ్రామానికి చెందిన రైతులు ఆటో బోల్తాపడి గాయపడటంతో స్పందించిన ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ ఆదేశాల మేరకు బయ్యారం ఎస్ఐ తిరుపతి 11 బస్తాల యూరియాను బాధితుల ఇంటికి తీసుకువెళ్లి అందజేశారు.
ఎస్పీ చిత్రపటానికి క్షీరాభిషేకం
యూరియా కోసం రైతులంతా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మహబూబాబాద్ ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ చొరవ తీసుకొని ఇబ్బందు లు తీర్చాడని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదుగుల గూడెంలో బుధవారం ఆయన చిత్రపటానికి రైతులు క్షీరాభిషేకం చేశారు. దాదాపు నెలరోజులు యూరియా కోసం తీవ్ర అవస్థలు పడ్డామని, ఎస్పీ చొరవతో పోలీసులు యూరియా పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు అయిన తర్వాతనే ఇబ్బంది తొలగిపోయిందని రైతులు చెప్పారు.