09-07-2025 10:11:14 PM
మేడ్చల్ (విజయక్రాంతి): విద్యారంగంలో ప్రతిష్టాత్మకంగా భావించబడే కెరియర్స్ 360 సంస్థ నిర్వహించిన జాతీయస్థాయి సమీక్షలో గుండ్లం పోచంపల్లి పరిధిలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల(Narsimha Reddy Engineering College)కు బెస్ట్ పెరఫార్మింగ్ ఇంజనీరింగ్ కాలేజీ అవార్డు లభించింది. ఈ అవార్డును కెరియర్స్ 360 అసోసియేట్ పబ్లిషర్, సిఎస్ఓ ధీరజ్ శర్మ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలేజీ యాజమాన్యం విద్యా ప్రమాణాలపై చూపిస్తున్న నిబద్ధత అభినందనీయమని, ఫ్యాకల్టీ అభివృద్ధి, పరిశోధన ప్రోత్సాహం, పరిశ్రమలతో భాగస్వామ్యం, విద్యార్థుల బలమైన ఫలితాలు కళాశాలను అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్తాయన్నారు.
ఈ విజయం వెనుక యాజమాన్యం ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. ఈ అవార్డు కాలేజీ విజన్, మిషన్, నిబద్ధతకు ప్రతిఫలంగా లభించిందని కాలేజీ కార్యదర్శి జె త్రిశూల్ రెడ్డి తెలిపారు. ఈ గుర్తింపు మరింత బాధ్యతను పెంచిందన్నారు. చైర్మన్ జే నరసింహారెడ్డి, కోశాధికారి త్రిలోక్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ ఏ మోహన్, ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ లోకనాథం తదితరులు హర్షం వ్యక్తం చేశారు.