25-08-2025 07:22:07 PM
మునుగోడు (విజయక్రాంతి): మునుగోడు మండలం(Munugode Mandal)లోని కాల్వలపల్లి గ్రామం సమస్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. సోమవారం ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని వీధులను పరిశీలించారు. కల్వలపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, గ్రామ ప్రజలు వివిధ అవసరాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు ఉచిత బస్సు పథకం మహిళలకు అందని ద్రాక్షల మారిందని అన్నారు. గ్రామ ప్రజలకు కనీస వసతులు కల్పించకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారని అన్నారు.
కోట మైసమ్మ గుడి నుండి పుల్పల్పుల రోడ్డు వరకు, దోమల పెళ్లి రోడ్డుకు ఇరువైపులా మురికి కాల్వ నిర్మాణం చేపట్టాలని కోరారు. పలు వీధులలో సిసి రోడ్లు , అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనుల నిర్మాణంకు నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాలలో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్తున్నా "ప్రజా ప్రభుత్వం" నినాదంకు బదులు పల్లెలకు పైసలు ఇయ్యలేని ప్రభుత్వమని ప్రచారం చేసుకుంటే బాగుంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, గ్రామ కార్యదర్శి వంటెపాక అయోధ్య,వంటెపాక రమేష్ , రాజబాబు, యాదయ్య ఉన్నారు.