31-07-2025 01:02:33 AM
ములుగు వెంకటపూర్,జూలై30(విజయక్రాంతి): పామాయిల్ పంట సాగుతో రైతు పెట్టుబడి తక్కువ పెట్టి ఎక్కువ ఆదాయం పొందవచ్చని రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ సూచించారు. బుధవారం వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ దగ్గరలోని కె.ఎన్. బయోసైన్స్ ఆయిల్ ఫామ్ నర్సరీని జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్. సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నర్సరీ విస్తీర్ణం ఎన్ని ఎకరాలు? నర్సరీలో ఎన్ని మొక్కలు పెంచారు? ఎన్ని నాటుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి? ఈ సంవత్సరం రైతులకు నాణ్యమైన మొక్కలు ఉన్నాయా ? తదితర విషయాలపై జిల్లా ఉద్యాన అధికారిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు అవగాహన కల్పించి ఎక్కువ ఎకరాల్లో నాటించాలని ఉద్యాన అధికారులకు ఆదేశించారు. నర్సరీ నిబంధనల మేరకు నాణ్యమైన మొక్కలను రైతులకు సకాలంలో అందించాలని, నర్సరీ నిర్వాహకులకు,నర్సరీ కంపెనీ వారికి కలెక్టర్ ఆదేశించారు. అన్ని రికార్డులు సిద్ధంగా ఉంచాలని నర్సరీ ఇంచార్జీకి ఆదేశించారు.