28-07-2025 11:14:59 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కాన్పు కోసం వచ్చిన బాలింత కవల పిల్లలకు జన్మనిచ్చి మరణించిన ఘటన సోమవారం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య మరణించిందని మృతురాలి భర్తతో పాటు కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట సోమవారం రాత్రి ఆందోళనకు దిగారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లి గ్రామ శివారు బోద తండాకు చెందిన గర్భిణి బోడ పద్మ(25) కాన్పు కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆదివారం మధ్యాహ్నం చేరింది. వైద్యులు ఆమెను పరీక్షించి సోమవారం కాన్పు చేయగా కవల పిల్లలు జన్మించారు. అనంతరం గర్భిణీ పద్మ చికిత్స పొందుతూ మరణించింది. జన్మించిన పిల్లలిద్దరూ ఆరోగ్యంగా ఉండగా తల్లి మరణంతో వైద్యుల నిర్లక్ష్యం ఉందని బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.