23-12-2025 05:05:01 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ కో ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలకు రాష్ట్ర స్థాయి ఉత్తమ విద్యాసంస్థగా అవార్డు లభించింది. మంగళవారం హైదరాబాదులోని నోవాటెల్ హోటల్ లో జరిగిన మల్లారెడ్డి విశ్వవిద్యాపీట్ సమర్పించిన హైబిజ్ టివి ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు బెల్లంపల్లి కళాశాల ఎంపికైంది. బెల్లంపల్లి ప్రభుత్వ కో ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అవునూరి అంజయ్య కళాశాల తరఫున ఈ అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు కృష్ణవేణి, తిరుమల దేవి, చంద్రయ్య పాల్గొన్నారు.
ఉత్తమ అవార్డు పట్ల హర్షం..
బెల్లంపల్లి ప్రభుత్వ కో ఎడ్యుకేషన్ కళాశాలకు ఉత్తమ రాష్ట్రస్థాయి అవార్డు రావడం పట్ల ప్రిన్సిపల్ అంజయ్య హర్షం వ్యక్తం చేశారు. విద్యా సామర్ధ్యాల పెంపు, ఉత్తమ ఫలితాలు, కళాశాల క్యాంపస్ నిర్వహణ, సిబ్బంది పనితీరు వల్లనే కళాశాలకు ఉత్తమ అవార్డు వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో ఉమ్మడి జిల్లా తరపున, ఉత్తమ విద్యా సంస్థగా అవార్డును పొందినందుకుగాను, కళాశాల ప్రిన్సిపల్ అంజయ్యను, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి కే. అంజయ్య, ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ శ్రీకృష్ణ ఆదిత్య, ఐఏఎస్ అభినందించారు. ఈ అవార్డు పొందడం పట్ల విద్యాసేవలో, సమాజం పట్ల తమ బాధ్యత మరింత పెరిగినట్టు అయిందని కళాశాల ప్రిన్సిపల్ అంజయ్య అన్నారు. ఉత్తమ రాష్ట్ర అవార్డు రావడానికి కళాశాల లెక్చరర్లు, సిబ్బంది సమిష్టి కృషి అని ప్రిన్సిపల్ అంజయ్య వారిని అభినందించారు.