07-05-2024 12:11:38 AM
ఒడిశాను దోపిడీ చేసిన రెండు పార్టీలు
అద్భుత వనరులున్నా ఇంకా పేద రాష్ట్రమే
ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శలు
బర్హంపూర్ (ఒడిశా), మే 6: అత్యంత సమృద్ధిగా సహజ వనరులున్న ఒడిశా రాష్ట్రం దేశంలో ఇంకా పేద రాష్ట్రంగానే మిగిలిపోవటానికి కాంగ్రెస్, బీజేడీ పార్టీలే కారణమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చిన ఈ 76 ఏండ్లలో ఒడిశాను నాడు కాంగ్రెస్ దోపిడీ చేస్తే.. నేడు బిజూ జనతాదళ్ (బీజేడీ) దోపిడీ చేస్తున్నదని ఆరోపించారు. లోక్సభ ఎన్నికలతోపాటే ఒడిశా అసెంబ్లీకి కూడా పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ సోమవారం బర్హంపూర్, గంజాంలో బీజేపీ ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ, బీజేడీ రాష్ట్రంలో చాలాకాలం మిత్రపక్షాలుగా ఉన్నాయి. దీంతో గతంలో మోదీ ఎన్నడూ బీజేడీపై విమర్శలు చేయలేదు. తాజాగా ఆయన అధికార పార్టీపై విమర్శల బాణాలు ఎక్కు పెట్టడం, అందుకు బీజేడీ కూడా గట్టిగానే కౌంటర్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.
కూలీలెందుకు వలస పోతున్నారు?
సుదీర్ఘకాలంగా ఒడిశాను పాలిస్తున్న ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ సొంత నియోజకవర్గం హింజిలి నుంచే కూలీలు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. పట్నాయక్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే కూలీలు వలస ఎందుకు పోతారని ప్రశ్నించారు. ‘ఒడిశాలో నీళ్లున్నాయి. వ్యవసాయ భూములున్నాయి. ఖని జాలున్నాయి. సుదీర్ఘమైన సముద్రతీరం ఉన్నది. మరి ఒడిశా ప్రజలు ఇంకా పేదరికంలోనే ఎందుకు ఉన్నారు? ఇందుకు సమాధానం దోపిడీ. మొదట కాంగ్రెస్ నేతలు, ఆ తర్వాత బీజేడీ నేతలు రాష్ట్రాన్ని లూటీ చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం నుంచే కూలీలు ఇతర రాష్ట్రాలకు ఎందుకు వలస పోతున్నారు? ’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.
మూడున్నర లక్షల కోట్లిచ్చాం
ఒడిశా రాష్ట్రానికి గత పదేండ్లలో రూ.3.5 లక్షల కోట్ల నిధులు ఇచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. ‘కేంద్రంలో సోనియాగాంధీ రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు పదేండ్లలో ఒడిశాకు రూ.లక్ష కోట్లు ఇచ్చారు. కానీ, పదేండ్ల మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి రూ.3.5 లక్షల కోట్లు ఇచ్చింది. ఒడిశా ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదు. కేంద్రం ప్రతి గర్భిణికి రూ.6వేలు ఇస్తున్నది. కానీ, ఒడిశా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి కేంద్రం రూ.10 వేల కోట్లు విడుదల చేసింది. ఆ డబ్బు ఖర్చు చేయటానికి కూడా ఇక్కడి ప్రభుత్వానికి చేతకాలేదు. జూన్ 4 బీజేడీ ప్రభుత్వానికి ఎక్స్ పైరీ డేట్. ఒడిశా కొత్త అవకాశాలకు బీజేపీ సూర్యుడిలాంటిది’ అని మోదీ అన్నారు.