15-10-2025 04:30:13 PM
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి..
దేవరకొండ (విజయక్రాంతి): బీసీలకు 42% రిజర్వేషన్లలను కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ), బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో దేవరకొండలో నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ నిర్వహించి బస్ స్టాండ్ ముందు 167 జాతీయ రహదారిపై సిపిఐ శ్రేణులు నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి మాట్లాడుతూ బీసీ బిల్లులను ఆమోదించి, రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన ఉందని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కులగణన, సర్వే నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి పంపించినా స్పందించలేదన్నారు. బీసీల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తొమ్మిదివ షెడ్యూలులో చేర్చేందుకు రాజ్యాంగ సవరణ ద్వారా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంటును సమావేశపరిచి, ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ,సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, మండల సహాయ కార్యదర్శి నూనె రామస్వామి, పట్టణ కార్యదర్శి వలమల్ల ఆంజనేయులు, తదితరులు వున్నారు.