24-12-2025 02:28:07 AM
హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా అధికారం ఉన్నదని, రాజకీయ ప్రాధాన్యత ఉందన్న భ్రమలో బీఆర్ఎస్ నేతలు బతుకుతున్నారని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజా సమస్యలు మరిచి అనవసర వ్యాఖ్యలతో వార్తల్లో నిలవాలనుకునే నేతలకు అసెంబ్లీ కాదు.. బిగ్బాస్ షోనే సరైన వేదిక అని కేటీఆర్, హరీశ్రావులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరీశ్రావుకు ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనే ట్యాగ్ తప్ప పార్టీ లోపలా, బయటా ఎలాంటి ప్రాధాన్యత లేదన్నారు.
సొంత పార్టీ నేతలే కూర్చోడానికి సీటు ఇవ్వని పరిస్థితిలో సీఎం రేవంత్రెడ్డిపై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పద మన్నారు. సీఎం రేవంత్రెడ్డి బీఆర్ఎస్ నేతలను రాజకీయంగా ఫుట్బాల్ ఆడి గ్రౌండ్ అవతల పడేశారని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి గురించి మాట్లాడే స్థాయి హరీశ్రావుకు లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పాపంలో కేసీఆర్తో పాటు హరీశ్రావు పాత్ర కూడా ఉందని ఆరోపించారు.
ఈ వ్యవహారంలో ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చారని అన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనవిజయంతో బీఆర్ఎస్ నేతల మైండ్ బ్లాక్ అయిం దని, అభివృద్ధి జరుగుతుంటే ఓటమి రాజకీయాలతో విమర్శలు చేయడం తప్ప వారికి చేతకావడం లేదన్నారు. సర్పంచ్ ఎన్నికలతో బీఆర్ఎస్ రాజకీయ సమాధి తవ్వబడిందని, బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ నేతలకు కనీసం 14 సంవత్సరాలు రాజకీయ వనవాసం తప్పదని స్పష్టం చేశారు.