31-10-2025 12:15:31 PM
 
							హుజురాబాద్,(విజయక్రాంతి): హుజురాబాద్ నియోజకవర్గంలో మెంథా తుపానుతో రైతులుతీవ్ర నష్టపోయారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(BRS MLA Kaushik Reddy ) ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మెంథా తుపాన్ ఊహించలేనిదని, ధాన్యం తడిసిపోవడం, పంటలు నేలరాలిపోవడం, వరదల్లో కొట్టుకుపోవడం రైతులకు తీవ్రమైన నష్టం వాటిలిందని, ఆరుగాలం శ్రమించి కోతకు సిద్ధమైన పంట నీటిపాలైందని, రైతుల కష్టం వృథా అయిందని పేర్కొన్నారు.
రైతుల బాధ వర్ణనాతీతమని, వారిని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. యూరియా, విత్తనాలు అందక, రైతు భరోసా ఆలస్యమై ఇప్పటికే రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను నిజంగా ప్రేమిస్తే, వెంటనే నష్టపరిహారం రైతుల అకౌంట్లలో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల రైతులతో కలిసి ఉద్యమం చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నష్టపోయిన రైతాంగానికి తన నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ప్రకటనలో పేర్కొన్నారు.