బీఆర్ఎస్ కీలక ఘట్టాలకు వరంగల్ వేదిక
హైదరాబాద్: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) బుధవారం నాడు పర్యటించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభాస్థలి వద్ద ఏర్పాట్లను స్థానిక నేతలతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తిలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలు పూర్తి చూసుకున్న ప్రాంతీయ పార్టీలు రెండు మాత్రమే ఉన్నాయని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏర్పాటైన పార్టీల్లో టీడీపీ, టీఆర్ఎస్ మాత్రే 25 ఏళ్లు పూర్తి అయిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కీర్తిని హిమాలయాల స్థాయికి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ది అని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ కు సంబంధించి కీలక ఘట్టాలకు వరంగల్ వేదిక ఉందని చెప్పారు. ఇప్పుడు రజతోత్సవ సభకు కూడా వరంగల్ వేదిక కావడం సంతోషకరమని కేటీఆర్ స్పష్టం చేశారు. రజతోత్సవ సభకు దాదాపు వెయ్యి ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సభా ప్రాంగణంలో వందకుపైగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.






