08-10-2025 06:25:45 PM
గర్భిణీలు, బాలింతలకు సిడిపిఓ రాధిక సూచనలు..
కాటారం (విజయక్రాంతి): ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని మహిళా శిశు సంరక్షణ అధికారిని(సిడిపిఓ) రాధిక సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుసాపూర్ అంగన్వాడి కేంద్రంలో పోషణ మాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ రాధిక హాజరయ్యారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ తక్కువ ఖర్చులో, ఎక్కువ పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు లాంటి వాటిని గర్భవతులు, బాలింతలు, పిల్లలు తప్పనిసరిగా తీసుకోవాలని, దాని వల్ల అనేక వ్యాధుల నుండి రక్షణ లభిస్తుందని వివరించారు.
అంగన్వాడి కేంద్రంలో అందించే సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలను అంగన్వాడీలో చేర్పించాలని అన్నారు. గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవోలు సమ్మయ్య, శ్రీలత, అంగన్వాడి టీచర్లు షాహేదా బేగం, శ్రీలత, హైమావతి, పుష్పలత, ఆయాలు, గ్రామ పరిధిలోని గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.