08-10-2025 07:54:30 PM
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య..
నకిరేకల్ (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో అమలుకానీ హామీలు, ఆరు గ్యారంటీల పేరిట ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. బుధవారం నకిరేకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎన్నికల గ్యారంటీ కార్డు ప్రకారం 22 నెలల పాలనలో ఇవ్వవలసిన "కాంగ్రెస్ బాకీ కార్డును" ఆయన ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిన హామీలను గుర్తు చెయ్యాలని ప్రజల వద్దకు బాకీ కార్డులను తీసుకొచ్చామని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో అధికార కోసం కాంగ్రెస్ నాయకులు పడరానిపాట్లు, తినరానిగడ్డి తిన్నారని ఆయన విమర్శించారు. అమలుకానీ హామీలతో, మోసపూరిత మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది అన్నారు. దేశంలో అన్నివర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు.
రైతు భరోసా, రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసింది.. వృద్దులకు 4 వేల పెన్షన్ దివ్యాంగులకు 6 వేలు ఇస్తామని మోసం చేసింది.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. మహిళలను, విద్యార్థినులను, నిరుద్యోగులను, ఆటోకార్మికులను, రైతు కూలీలను మోసం చేసిన దుర్మార్గులు కాంగ్రెస్ నాయకులు అన్నారు .22 నెలలు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం రావడం లేదన్నారు. కాంగ్రెస్ అసమర్థపాలనతో గ్రామాల్లో ప్రజలు దుమ్మెతి పోస్తున్నారనీ విమర్శించారు. ఎన్నికలు ఏవైనా, ఎప్పుడైనా గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నాయకులు గుర్రం గణేష్, సోమ యాదగిరి, రాచకొండ వెంకన్న గౌడ్, ప్రగాడపు నవీన్ రావు, పల్లె విజయ్, నోముల కేశవరాజు, సామా శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.