25-08-2025 07:11:09 PM
రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండ శ్రీశైలం
చండూరు,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సరిపడా యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యావని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండ శ్రీశైలం మాట్లాడుతూ... సోమవారం గట్టుప్పల మండల కేంద్రంలోని గట్టుప్పల వ్యవసాయ అధికారికి రేవతికి సిపిఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సరిపడ యూరియా అందించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర బిజెపి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్ర రైతాంగానికి ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్రానికి9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా, ఇప్పటివరకు5.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే కేంద్రం ఇచ్చిందని దీంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా యూరియాపై పోరాడకుండా కల్లప్పగించి చూస్తూ, రైతులను ఇబ్బందులు పెట్టడం ఏంటని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు లేకపోవడం వలన గ్రామాలలో ప్రజా సమస్యలు కుప్పలు కుప్పలుగా పేరుకపోయావని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం యూరియా కోసం బారులు తీరుతున్నారని, అనేకమంది అస్వస్థకు గురై గాయాలు పాలవుతున్నారని ఆయన అన్నారు. యూరియా కొరతేలేదని అధికారులు చెప్పడం సరైన పద్ధతి కాదని, తెలంగాణ రాష్ట్రానికి రైతులకు సరిపడా యూరియాను అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు.