21-07-2025 01:59:31 AM
వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చైర్మన్ వీరయ్య
మలక్పేట్, జూలై 20 (విజయక్రాంతి): దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తునేని వీరయ్య అన్నారు. ఆదివారం మలక్పేటలోని దివ్యాంగుల భవన్లో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం, అనుబంధ దివ్యాంగుల సంఘాల జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ముత్తినేని వీరయ్య హాజరై ప్రసంగించారు. దివ్యాంగుల సమస్యలను తెలుసుకునేందుకు నేరుగా వారిని కలిసి, సమస్యలను స్థానిక ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు త్వరలో ‘దివ్యాంగుల చెంతకు వీరయ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూనున్నామని తెలిపారు. వారంలో 4 రోజులు జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాలలో దివ్యాంగులను కలుస్తామని, వారి సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల కుటుంబాలను కలిసి నాలుగు రోజులు వారి ఇండ్లలోనే నిద్రిస్తాని చెప్పారు. రాబోయే మూడున్నర సంవత్సరాలు దివ్యాంగుల సంక్షేమ అభివృద్ధి చరిత్రలో లిఖించబడుతుందని పేర్కొన్నారు. దివ్యాంగుల సమగ్రాభివృద్ధి కోసం వ్యక్తిగత రుణాలు ఇస్తున్నామని, నిరుద్యోగ దివ్యాంగులకు రాజీవ్ యువ వికాసంలో 5శాతం రిజర్వేషన్, ఇందిరమ్మ ఇండ్లలో 5శాతం రిజర్వేషన్ ఇచ్చామని చెప్పారు.
దివ్యాంగుల కుటుంబాల ఆర్థిక స్థిరత్వమే లక్ష్యంగా గ్రామానికో దివ్యాంగుల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ చేయబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగోతు వీరన్న నాయక్, బోట్ల సురేష్, అజీమ్, ప్రశాంత్, పూజారి మాణిక్యం, చక్రపాణి, శంకర్ నాయక్, మేకల సమ్మయ్య, బోట్ల సుమతీ, గై సతీష్, యాకుబ్, అసద్, బత్తిని రాజు, ఐలేష్, 30 మంది ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.