25-10-2025 11:19:27 AM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Telangana CM Revanth Reddy) శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుల నియామకాలపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (All India Congress Committee) నాయకత్వంతో చివరి రౌండ్ చర్చల కోసం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Telangana Pradesh Congress Committee)కి అధిష్ఠానం నుంచి ఇప్పటికే పిలుపు వచ్చింది. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు సమావేశం కానున్నారు.
35 డీసీసీ అధ్యక్షుల నియామకానికి మూడేసి పేర్లు చొప్పున జాబితా తయారు చేశారు. పరిశీలకులు మూడేసి పేర్లు చొప్పున జాబితా రెడీ చేసి అధిష్ఠానానికి ఇచ్చారు. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం ఇవాళ తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని పరిపాలన, పార్టీ పరిస్థితులపై చర్చించనున్నారు. జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల నియామకంపై ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బీ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారు.