05-08-2025 06:13:15 PM
జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల అర్బన్,(విజయ క్రాంతి): సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తెలిపారు. మంగళవారం మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ లో జరుగుతున్న వైద్య పరీక్షల వివరాలను, స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్ లను పరిశీలించారు. ఫార్మసీ విభాగంలో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. రోగులకు కావలసిన మందులు (మెడిసిన్) అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యులను ఆదేశించారు. ఆసుపత్రిలో ఎంత మంది ఇన్ - ఔట్ పేషెంట్ వస్తున్నారో ఆరా తీశారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఔట్ పేషంట్ లలో వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని, రోగి లక్షణాలు రికార్డు చేయాలని తెలిపారు. ముందస్తుగా వ్యాధి నిర్ధారణ జరిగితే మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలని, సమయ పాలన పాటించాలని అన్నారు.