calender_icon.png 28 May, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30న మళ్లీ రండి

27-05-2025 12:52:34 AM

-సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు అధిష్ఠానం సూచన 

-ఏఐసీసీ చీఫ్ ఖర్గే అందుబాటులో లేకపోవడంతో పీసీసీ కార్యవర్గం ప్రకటన వాయిదా

- రెండురోజులుగా హస్తినలోనే సీఎం, పీసీసీ చీఫ్ 

- కేసీ వేణుగోపాల్‌తో సమావేశం 

- పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గవిస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ

- వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా

- నలుగురిని నియమించే చాన్స్ 

- హైదరాబాద్‌కు తిరిగొచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): పీసీసీ కార్యవర్గం కూర్పు కొలిక్కి వచ్చింది. ఒకటి, రెండు రోజుల్లో కార్యవర్గం ప్రకటించాలని భావించినప్పటికీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీ లో అందుబాటులో లేకపోవడంతో.. ఈ నెల 30న మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.

అందుకు  సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ సీనియర్ నేతలు ఢిల్లీకి రావాలని సూచించారు. రెండురోజులుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఢిల్లోనే పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు.

పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల పంపకంపై చర్చించారు. ఇప్పటికే ఆలస్యమైం దని, ఇక నాన్చడం కాకుండా తేల్చేయాలని నిర్ణయానికి వచ్చారు. తొలుత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ ఉపాధ్యక్ష పదవులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మిగతా పదవులను కూడా వీలైనంత తొందర్లోనే ప్రక టించాలనే ఆలోచనతో ఉన్నారు. అయి తే పార్టీపదవుల్లో సామాజిక న్యాయం పాటించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 70 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ కేసీవేణుగోపాల్‌తో పాటు ఇతర పెద్దలతో ఆది, సోమ వారాల్లో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ సమావేశమై చర్చించారు.

ఇక వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా నలుగురిని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేశ్‌కుమార్‌గౌడ్ ఉండ టంతో.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎస్సీ, ఎస్టీ, ఓసీతో పాటు మైనార్టీ వర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణ యం తీసుకున్నారు.

ఎస్సీ సామాజికవర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇక ఓసీల నుంచి భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

అయితే చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా ఉండటంతో.. రోహిన్‌రెడ్డికే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మైనార్టీల నంచి ఫిరోజ్‌ఖాన్, ఫయీమ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఫయీమ్ విషయంలో కొందరు సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

హైదరాబాద్‌లో నిత్యం అందుబాటులో ఉండే ఫిరోజ్‌ఖాన్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అవకాశం ఇవ్వాలని పార్టీ నేతలు అధిష్ఠానం పెద్దలకు సూచించించినట్లు సమాచారం. గత మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు. 

మంత్రివర్గంలో చోటు ఎవ్వరికి..?   

రాష్ట్ర క్యాబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ పదవుల కోసం పోటీ ఎక్కువగా ఉంది. అయితే ఒక సామాజికవర్గం నుంచి ఒకరికే అవకాశం ఇవ్వాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రాతినిధ్యంలేని జిల్లాలకు అవకాశం ఇవ్వాలని, ఆ తర్వాత మిగతా జిల్లాలను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయాని కి వచ్చినట్లు సమాచారం.

రాష్ట్రంలోని తాజాపరిస్థితులు, ప్రస్తుతం మంత్రివర్గం ఉన్న సామాజికఅంశాలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. రెడ్డి సా మాజికవర్గం నుంచి మంత్రివర్గంలో చోటుకోసం ఐదారుగురు పోటీ పడుతున్న విష యం తెలిసిందే.

మంత్రివర్గం రేసులో ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగో పాల్‌రెడ్డి, గడ్డం వివేక్, పీ సుదర్శన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, దొంతి మాధవరెడ్డి, ఆది శ్రీని వాస్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రేమ్‌సాగర్‌రావుతో పాటు ఎమ్మెల్సీ విజయశాంతి మంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. 

త్వరగా తేల్చాలని రాహుల్‌గాంధీని కోరాం: పీసీసీ చీఫ్

రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై అగ్రనేత రాహుల్‌గాంధీకి వివరించినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. సోమవారం ఆయన కుటుంబసభ్యులతో కలిసి రాహుల్‌గాంధీని కలిశారు.

ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ చేయాలని కోరామని, త్వరలోనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ కమిటీ ల ప్రకటన కూడా త్వరలోనే ఉంటుందన్నారు.