24-01-2026 12:29:58 AM
కందుకూరులో భారీ నిరసన
కందుకూరు, జనవరి 23 (విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరును *వీబీ జీ ’రామ్ జీ’*గా మార్చడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ, కందుకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలను లేవనెత్తారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మహాత్మా గాంధీ పేరును చరిత్ర పుటల నుంచి తొలగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల గుర్తులను చెరిపివేయడం ఎవరికీ సాధ్యం కాదని, భారతీయుల గుండెల్లో గాంధీజీ చిరస్థాయిగా నిలిచిపోతారని గుర్తు చేశారు. భవిష్యత్ తరాలకు గాంధీజీ సిద్ధాంతాలను, ఆయన చరిత్రను కాంగ్రెస్ పార్టీ నిరంతరం చేరువ చేస్తుందని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లు బొక్క జంగారెడ్డి, ఏనుగు జంగారెడ్డి, సర్పంచులు సరికొండ పాండు, బాలరాజ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మల్లేష్ సౌడపు వెంకటేష్ గౌడ్ లు పాల్గొన్నారు.