03-09-2025 11:44:32 PM
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్ర
కోడూరు చౌరస్తా ధర్నాలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): రైతులకు యూరియా అందించక నష్టం పోతున్నారని వారికి నష్టపరిహారం అందించకపోతే ఉద్యమం ఈ జిల్లా నుంచి ప్రారంభమవుతుందని, కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్ర చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ మండల పరిధిలోని కోడూరు చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.
రాష్ట్రంలో రైతులకు యూరియా ఇవ్వకుండా ఇబ్బందులపాలు చేస్తూ కాలేశ్వరం ప్రాజెక్టుపై చర్చ పెడుతుందని విమర్శించారు. గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న అధికారులు యూరియా అందించడం లేదని, ఎన్ని ఎకరాలు ఉన్న రైతుకు ఒకటి.. రెండు సంచులు యూరియా మాత్రమే అధికారులు ఇస్తున్నారన్నారు. రెండు..మూడు.. ఐదు ఎకరాలు పంట వేసిన రైతుల పరిస్థితి ఏంటో ఆలోచన చేయాలని పేర్కొన్నారు. తిండి తినకుండా.. రాత్రిళ్ళు వర్షంలో నిద్ర లేకుండా యూరియా కేంద్రల వద్ద రైతులు ఉన్న వారికీ యూరియా అందటం లేదని చెప్పారు.
రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నారని, యూరియాను వెంటనే సరఫరా చేయాలన్నారు. ఇసుక.. యూరియా కలుపుకొని చల్లాలి అని వ్యవసాయ మంత్రి అవగాహనా లేకుండా మాట్లాడుతున్నారన్నారు. పంటలు యెట్లా పండుతున్నాయి అనేది కూడా మంత్రులకు అవగాహన లేదన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ముఖ్యమంత్రి పర్యటన ఉన్న సమయంలో కూడా రైతులు యూరియా కోసం వరుసల్లో నిలబడిన పరిస్థితి జిల్లాలో ఉందని చెప్పారు.
కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం చెప్పులు లైన్ లో పెడుతున్నారని, లైన్ లలో ఉన్న వారు ఆకలితో సొమ్మసిల్లి పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా వేయకుంటే ఎకరాకు 40 సంచులు బదులుగా 20 సంచులు వస్తాయని, రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రభుత్వం రైతులకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులు నష్టపోతే ఈ జిల్లా నుంచి ఉద్యమం ప్రారంభం అవుతుందన్నారు.