24-05-2025 01:37:13 AM
మేడ్చల్, మే 23 (విజయక్రాంతి): యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సూచించారు. రాహుల్గాంధీ చేపట్టిన వైట్ టీ షర్ట్ ఉద్యమానికి మద్దతుగా కీసర బాలవికాస కేంద్రంలో మూడు రోజుల శిక్షణ శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమన్నారు.
దళితులకు, గిరిజనులకు ఇందిరాగాంధీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, రాజీవ్గాంధీ సమాచార విప్లవ పితామహుడిగా పేరుపొందారని చెప్పారు. కంప్యూటరైజేషన్, కమ్యూ నికేషన్ విప్లవం ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందన్నారు. శ్రీలంక సోవియట్ యూనియన్తో సంబంధాలను మెరుగుపరచడానికి కృషి చేశారని, ఓటు హక్కును 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఓటు హక్కు కల్పించారని చెప్పారు.
స్థానిక సంస్థల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్య క్రమంలో డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్రెడ్డి, వజ్రేష్ యాదవ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్రెడ్డి పాల్గొన్నారు.