25-11-2025 05:27:49 PM
బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ల ఆర్ధిక ఇబ్బందులు..
భట్టి విక్రమార్కకి ఫోన్, లేఖ ద్వారా కాంట్రాక్టర్ల పరిస్థితి వివరణ..
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..
చిట్యాల (విజయక్రాంతి): తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని తెలంగాణ శాసన మండలిలో మన ఊరు- మన బడి కాంట్రాక్టర్లు కలిసి పెండింగ్ లో ఉన్న తమ బిల్లులను ప్రభుత్వం త్వరగా విడుదల చేసేందుకు సహాయం చేయాలని వారు మంగళవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ వారి సమస్యలు తెలుసుకుని, సానుకూలంగా స్పందించి వెంటనే రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో ఫోన్ ద్వారా మాట్లాడి, రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు- మన బడి కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే లేఖను రాసి కూడా డిప్యూటీ సీఎంకి పంపించారు. మన ఊరు - మన బడి పనులు చేసిన వారు చిన్న కాంట్రాక్టర్లు అని, వారి బిల్లులు రాకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వివరించారు.