ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
బాన్సువాడ పట్టణ ఎస్హెచ్ఓ తుల శ్రీధర్
బాన్సువాడ,(విజయక్రాంతి): ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని బాన్సువాడ పట్టణ ఎస్హెచ్ఓ తుల శ్రీధర్ హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మంగళవారం సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు కోసం ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్ నియమాలను వివరించారు. ప్రధాన రహదారి వెంట ఉన్న వ్యాపార సముదాయాలను సందర్శించి, వ్యాపార యజమానులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ... రోడ్డు మీదకు దుకాణాలను విస్తరించడం వల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, ఇలాంటి చర్యలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రోడ్డు ఆక్రమణలు ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్నందున యజమానులు వెంటనే వాటిని తొలగించాలని సూచించారు. ప్రజల సురక్షిత ప్రయాణం కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా అనుసరించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.




