25-11-2025 07:29:09 PM
హైదరాబాద్: ఐబొమ్మ రవి ఎపిసోడ్పై అడిషనల్ సీపీ శ్రీనివాసులు మంగళవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఐబొమ్మ డొమైన్ ను ఎన్ జీల కంపెనీలో రిజిస్టర్ చేసినట్లు, ఐబొమ్మ వెబ్ సైట్ ను రవి మరో కంపెనీ నుంచి హోస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. కంటెంట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ద్వారా రవి సినిమాలు పోస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఐబొమ్మ, బప్పం వెబ్ సైట్ల ద్వారా రవి సినిమాలు పోస్ట్ చేసేవాడని, మూవీరూర్జ్, తమిళ్ ఎంవీ లాంటి మరికొన్ని పైరసీ వెబ్ సైట్లు నడుస్తున్నాయని పోలీసులు పేర్కొన్నారు.
ఇతర పైరసీ వెబ్ సైట్ నిర్వాహకులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని, ఐబొమ్మ పాపులర్ అయ్యాక.. దాని పేరును చాలామంది వాడుకుంటున్నారని పోలీసులు తెలిపారు. సినిమా సమీక్షలకు ఐబొమ్మ వెబ్ సైట్ పేరు వాడుకుంటున్నారని, ఇమ్మడి రవి రూ.20 కోట్ల వరకు సంపాదించినట్లు తెలిసిందని వివరించారు. భవిష్యత్ లో వెబ్-3 టెక్నాలజీ రాబోతుందని, దాని ద్వారా పైరసీ చేస్తే పట్టుకోవడం చాలా కష్టమని సైబర్ క్రైమ్ పోలీసులు వ్యాఖ్యానించారు. ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే ఐబొమ్మ రవి దొరికాడని అడిషనల్ సీపీ శ్రీనివాసులు వెల్లడించారు. రవి భార్య తమకు సమాచారం ఇచ్చిందన్న వార్తలు అవాస్తవం అని, అతని భార్యను మేం విచారించలేదన్నారు.
పైరసీ వ్యవహారం దర్యాప్తు చాలా సంక్లిష్టతతో కూడిన వ్యవహారమని, ఐబొమ్మ రవి ఒంటరి వాడని, ఈజీ మనీకి అవవాటుపడ్డాడని, వారానికో దేశం తిరిగేవాడని అడిషనల్ సీపీ శ్రీనివాసులు తెలిపారు. లక్ష డాలర్లు వెచ్చించిన రవి కరేబియన్ దీవుల పౌరసత్వం కొన్నాడని, ఐబొమ్మ, బప్పం మూవీ పోస్టర్లను రవి స్నేహితుడు నిఖిల్ తయారు చేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. మన చట్టాల ప్రకారం విదేశీయులు నేరం చేసినా నేరమే అవుతుందని, నేరగాళ్లను అప్పగింతపై మనకు పలు దేశాలతో ఒప్పందాలు ఉన్నాయన్నారు.
గేమింగ్, బెట్టింగ్ యాప్ ప్రకటనల ద్వారా డబ్బులు వచ్చేవని, ఆ డబ్బును యాడ్ బుల్ అనే కంపెనీకి రవి మళ్లించినట్లు అడిషనల్ సీపీ తెలిపారు. యాడ్ బుల్ కంపెనీ రవికి చెందినదే అని, ఈ కంపెనీకి డాలర్ల రూపంలో డబ్బు వస్తుందని అడిషనల్ సీపీ శ్రీనివాసులు వివరించారు. రవిని ఎలా ట్రాప్ చేశారు? అని, రవికి అనుమానం రాకుండా ఎవరు, ఎలాంటి మెయిల్స్ పెట్టారు? అని, హైదరాబాద్కు రప్పించేలా ఎలా ప్లాన్ చేశారనేదానిపై, అతని అకౌంట్కు ఎలా డబ్బులు వచ్చాయి? అని, యాడ్ కంపెనీలు ఏం చేశాయనేదానిపై సీపీ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.