09-10-2025 12:34:15 AM
కొత్తపల్లి, అక్టోబర్ 8 (విజయక్రాంతి): కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్లో మరియు వినాయక నగర్ లో బుధవారం రోజున కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ ఆపరేషన్లో పలు అంశాలపై తనిఖీలు చేసి, పాత నేరస్థులు అద్దెకు ఇల్లు తీసుకుని నివసిస్తున్నారా అని ఆరతీసి, సరైన ధృవపత్రాలు లేని 105 వాహనాలను వీటిలో 77 బైకులు, 27 ఆటోలు, ఒక ట్రక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు స్థానిక ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
సైబర్ నేరాలు జరుగుతున్న తీరును వివరించి, సైబర్ నేరానికి గురైనట్లయితే వెంటనే స్పందించి, నేరం జరిగిన గంట లోపల 1930 నంబర్కు ఫోన్ చేయడం ద్వారా తస్కరించబడిన సొమ్మును ఫ్రీజ్ చేసి తిరిగి పొందవచ్చని తెలిపారు.అలాగే మాదక ద్రవ్యాలను దుర్వినియోగం చేయడం, వాటిని అక్రమంగా రవాణా చేయడం, అమ్మకం, వినియోగించడం చట్ట ప్రకారం నేరం అని పోలీసులు స్పష్టం చేశారు.
అంతేకాకుండా, వాటి వలన కలిగే దుష్పరిణామాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని అడిషనల్ డీసీపీ హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వ్యక్తులపై సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100 ద్వారా లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ , రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ , ఇన్స్పెక్టర్లు బిల్లా కోటేశ్వర్ , ప్రదీప్ , సంజీవ్ , సదన్ కుమార్ తో పాటు ఇతర అధికారులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.