09-10-2025 01:11:39 AM
ఏఐసీసీ ప్రకటన
హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ టికెట్ కోసం మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు మరికొందరు ఆశించగా, పార్టీ అధిష్ఠానం నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపింది.
పీసీసీ కూడా మూడు పేర్లతో కూడిన జాబితాను ఢిల్లీకి పంపించిన విషయం తెలి సిందే. అయితే ఆశావహులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలిచి మాట్లాడారని, పార్టీ తప్పకుండా సముచితమైన గౌరవాన్ని ఇస్తుందని హామీ ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
పార్టీ ప్రకటించిన అభ్యర్థి విజయం కోసం సహకరించాలని చెప్పడంతో వారు పోటీ నుంచి తప్పుకోవడంతో, నవీన్ యాదవ్కు లైన్ క్లియరైందని పార్టీ వర్గా లు చెబుతున్నాయి. నవీన్ యాదవ్ గతంలో ఒకసారి మజ్లిస్ పార్టీ నుంచి, మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి బయోడేటా..
పేరు : నవీన్ యాదవ్
విద్యార్హత : బ్యాచిలర్ డిగ్రీ ఆర్చిటెక్చర్
పుట్టిన తేదీ : 22-11-83 (41 సంవత్సరాలు)
తండ్రి పేరు : చిన్న శ్రీశైలం యాదవ్
13న నోటిఫికేషన్..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అక్టోబర్ 6న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 11న పోలింగ్, 14వ తేదీన కౌం టింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి అక్టోబర్ 21 వరకు నామినేషన్ల స్వీకరణ, 22న నామినేషన్ల పరిశీలన, 24న నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఉండగా, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది.