calender_icon.png 23 August, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామగుండం కమిషనరేట్ లో ప్రజలు ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలి

23-08-2025 02:42:56 PM

డీజేలకు అనుమతులు లేవు

వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి

మత పెద్దలతో గణేష్ చతుర్థి, మిలాద్- ఉన్- నబీ పండుగల దృష్ట్యా శాంతి సంక్షేమ కమిటీ సమావేశంలో సీపీ అంబర్ కిశోర్ ఝా 

రామగుండం (విజయక్రాంతి): గణపతి నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉన్నందున, రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను కమీషనరేట్ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో మతసామరస్యం సోదర భావంతో పండుగలను నిర్వహించాలని రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(Commissioner Amber Kishore Jha) తెలిపారు. శనివారం ముందస్తు చర్యల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపెల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోని అన్ని వర్గాల మత పెద్దలతో గణేష్ చతుర్థి, మిలాద్- ఉన్- నబీ ల పండుగల దృష్ట్యా శాంతి సంక్షేమ కమిటీ సమావేశం సీపీ అంబర్ కిశోర్ ఝా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... ప్రతి పండుగ ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని సదుద్దేశంతో అన్ని మతాల పెద్దలతో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. 

గత సంవత్సరం రామగుండం కమిషనరేట్ పరిధిలో 4786లో మంచిర్యాల జోన్ పరిధిలో - 2316, పెద్దపెల్లి జోన్ పరిధిలో 2476 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సంవత్సరం వినాయక విగ్రహాల ఏర్పాటు పెరిగే అవకాశం ఉందన్నారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారు అన్ని వివరాలతో సంబంధిత పోలీస్ స్టేషన్లో సంప్రదించి, తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. నమోదు చేసుకున్న వాటి వివరాల ఆధారంగా ఆన్లైన్ చేయడం విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేయడం చేస్తామని, నిమజ్జన సమయంలో  ఎలాంటి అవాంతరాలు జరగకుండా శోభయత్ర  సాఫీగా సాగేలా రూట్ మ్యాప్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తామన్నారు. గణపతి మండపాల వద్ద జరిగే కార్యక్రమాలకు బాధ్యత వహిస్తూ ప్రతి ఒక్క గణపతి మండప కమిటీ అధ్యక్షుడు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని, గణేష్ మండపాల వద్ద నిర్మాణ కమిటీలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, నిరంతర నిఘా ఉంటుందని, 24*7 నిరంతరం ప్రతి విగ్రహం వద్ద ఇద్దరు తప్పనిసరిగా ఉండాలని, పాయింట్ బుక్ ఏర్పాటు చేస్తామని, బ్లూ క్లోట్స్, పెట్రో కార్ వారు చెక్ చేయడం జరుగుతుందన్నారు. 

మండపాల పేరుతో ఎలాంటి లక్కీ డ్రాలు నిర్వహించకూడదని, అలాగే జూదాన్ని నిర్వహించరాదని, బలవంతపు చందాలు తీసుకోరాదని, గణేశుని మండపాల వద్దకు మద్యం సేవించి రాకుండా కమిటీ నిర్వాహకులు చూసుకోవాలని, ప్రతి మండపం వారు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించకూడదని, తప్పనిసరిగా విద్యుత్ శాఖ వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, అనుమతి లేకుండా మండపాలకు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయకూడదని, విద్యుత్ కనెక్షన్లు, లైట్ల ఏర్పాటుకు నాణ్యమైన వైర్లను, పరికరాలను వినియోగించాలని, ట్రాఫిక్ కు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు. కొంతమంది సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు పుకార్లు ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెట్టే అవకాశం ఉందని, ప్రజలు వాటి పోస్టులను చూసి సంయమనం పాటించాలని, నిజామా, అబద్దమా అని స్థానిక పోలీస్ వారిని అడిగి తెలుకోవాలని అన్నారు. ఏలాంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే డయాల్ 100, కమీషనరేట్ కంట్రోల్ రూం 8712656597 కానీ లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు. 

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి మత ఘర్షణలు జరిగేలాగా లా అండ్ ఆర్డర్ సమస్య కు కారణం అయితే అట్టి వారి ఫై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీపీ హెచ్చరించారు. గణేష్ నిమజ్జనంతో పాటు, మిలన్ -ఉన్ -నబి పండుగలు రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు సూచించిన నిబంధనలు కచ్చితంగా పాటించాలని, శోభాయాత్ర సమయంలో పోలీస్ శాఖ రోడ్ మ్యాప్ ను అనుసరించాలని, పోలీస్ వారికీ శాంతి కమిటీ సభ్యులు సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్, పెద్దపల్లి డిసిపి కరుణాకర్,  స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మల్లారెడ్డి, గోదావరిఖని ఏసిపి రమేష్, మంచిర్యాల ఎసిపి ఆర్ ప్రకాష్, జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ఏ ఆర్ ఏసి పి ప్రతాప్, గోదావరిఖని 1-2 టౌన్ సీఐ లు ఇంద్రసేనారెడ్డి, ప్రసాద్ రావు, పెద్దపెల్లి సిఐ ప్రవీణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్, ఇతర వింగ్స్ ఇన్స్పెక్టర్లు, పీస్ కమిటీ సభ్యులు, అన్ని మతల పెద్దలు పాల్గొన్నారు.