08-05-2025 01:03:00 AM
కొందరు హీరోయిన్లు అందం, అభినయంతోపాటు డ్యాన్స్, సింగింగ్తో సత్తా చాటుతుంటారు. దీంతో అటు ప్రేక్షకుల మదిని దోచేయడమే కాక ఇటు మూవీ మేకర్స్నూ ఆకట్టుకుంటారు. హైదరాబాదీ అందం ఫరియా అబ్దుల్లా ఈ కోవలోకే వస్తుందని చెప్పాలి. ‘జాతిరత్నాలు’లో ఆరడుగుల హైట్, అమాయకమైన నవ్వుతో ఆకటుకున్న ఈ భామ ఆ సినిమాలోని చిట్టి పాత్ర పేరుతో కుర్రాళ్ల గుండెల్లో తిష్ట వేసింది.
అలా అభిమానులంతా ఫరియాను తమ ‘చిట్టి’ గుండెలో పెట్టుకొని ఆరాధిస్తుంటే.. ఈ అమ్మడు మాత్రం పలువురు టాలీవుడ్ హీరోల పేర్లు జపిస్తోంది. తనకు టాలీవుడ్ అగ్రనటులు నాగార్జున, పవన్కల్యాణ్, ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని చెప్తోంది. తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఫరియా.. ఈ ముగ్గురు సూపర్ స్టార్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఓ ముగ్గురు సెలబ్రెటీలతో డేటింగ్, లవ్, మ్యారేజ్ అవకాశం వస్తే ఎవరి పేర్లు చెబుతారని అడగ్గా, ఫరియా స్పందిస్తూ.. తనకు అవకాశం వస్తే యంగ్ పవన్కల్యాణ్తో డేటింగ్, యంగ్ నాగార్జునను లవ్ చేస్తానని ఉందని చెప్పింది. పెళ్లి మాత్రం ప్రభాస్ను చేసుకోవాలని ఉందని తెలిపింది. ఇక కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్పై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. తమిళంలో ‘వల్లి మయిల్’ అనే సినిమాలో తొలిసారి హీరోయిన్గా చేస్తోంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాపైనే ఫరియా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ ప్రాజెక్టుకు సైన్ చేయడం ద్వారా అలా పొరుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిందో లేదో మరో క్రేజీ ఆఫర్ ఆమెను వరించినట్టు వార్తలొస్తున్నాయి. జసన్ సంజయ్ డైరెక్టర్గా ఎంట్రీ ఇవ్వనున్న మూవీలో హీరోయిన్గా ఫరియా ఎంపికైనట్టు కోలీవుడ్లో టాక్ వినవస్తోంది. ఇందులో విష్ణువిశాల్ హీరోగా నటించనున్నారు.