18 April, 2026 | 12:28 AM

ఇలాంటి చిత్రాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి

08-05-2025 01:00 AM

డైరెక్టర్ రాజ్ రాచకొండ మరో ఆసక్తికర ప్రాజెక్టు ‘23’తో వస్తున్నారు. ఈ చిత్రంలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. స్టూడియో 99 పతాకంపై రూపొందిన ఈ సినిమాకు వెంకట్ సిద్దారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ఈ సినిమా మే 16న రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా హీరో ప్రియదర్శి, గీత రచయిత చంద్రబోస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

చంద్రబోస్ మాట్లాడుతూ.. “డైరెక్టర్ రాజ్ వజ్ర సంకల్పంతో సినిమా తీస్తారు. నిలువెత్తు నిజాయితీ ఉన్న డైరెక్టర్ ఆయన. నేను ఈ సినిమాకు పాటలు రాయడం కన్నా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఎక్కువ బాధ్యతగా అనిపించింది” అన్నారు. “నా కెరీర్‌కు కొత్త ఊపిరినిచ్చిన వ్యక్తి డైరెక్టర్ రాజ్. ఈ సినిమా కథ నాకు తెలుసు. కొన్ని వేరే ప్రాజెక్ట్స్ ఉండటం వల్ల నేను ఇది చేయడం కుదరలేదు.

ఈ ట్రైలర్ చూసిన తర్వాత నేను చేసుంటే బాగుండేదని చిన్న ఈర్ష్య కలిగింది’ అని ప్రియదర్శి అన్నారు. చిత్ర దర్శకుడు రాజ్ రాచకొండ మాట్లాడుతూ.. “చాలా స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్‌తో చేసిన సినిమా ‘23’. చిన్న చిత్రాల్లో ఇది చాలా పెద్ద సినిమా. కమర్షియల్ క్యాలిక్యులేషన్స్‌తో చేసిన సినిమా కాదిది. ఇలాంటి చిత్రా లను ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాలి’ అన్నారు. నటి తన్మయి, నటులు తేజ, పవన్ రమేశ్, ప్రణీత్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.