27-12-2025 12:00:00 AM
ఎల్లారెడ్డి, డిసెంబర్ 26 (విజయ క్రాంతి): మూగజీవాలైన మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు తప్పనిసరిగా వేయాలని పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ అర్చన రైతులకు సూచించారు. నట్టల వల్ల జీవాల ఆరోగ్యం దెబ్బతిని ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. నట్టల నివారణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎల్లారెడ్డి మండలం సాతెల్లి గ్రామంలో నట్టల మందు పంపిణీ కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాధానాగరాజుతో కలిసి వైద్యురాలు మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు వేశారు.
డా. అర్చన మాట్లాడుతూ, నట్టల నివారణ ద్వారా జీవాలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా రైతులకు ఆర్థిక నష్టం తగ్గుతుందని తెలిపారు. ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాను ప్రసాద్, పశుసంవర్థక శాఖ సిబ్బంది, రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.