13-12-2024 02:15:12 AM
* భిక్కనూర్ టోల్ప్లాజా వద్ద ఆగిన బస్సు
* ప్రయాణికుల ఇబ్బందులు
కామారెడ్డి, డిసెంబర్12 (విజయక్రాంతి): ఆర్టీసీ బస్సు డ్రైవర్ డీజిల్ ఫిల్లింగ్ ముందుగానే చూసుకోలేదు. మధ్యలో బస్సు ఆగి పోయేవరకు ఆయనకు సోయి లేకపోయిం ది. బస్సు మధ్యలో ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గురువారం ఉదయం భోధన్ నుంచి హైదారాబాద్కు బయల్దేరింది. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ టోల్ప్లాజా వద్దకు రాగానే బస్సు ఆగిపోయింది. డ్రైవర్ చెక్ చేసి డీజిల్ అయిపోయిందని చెప్పగానే ప్రయాణికులు నివ్వెరపోయారు. డ్రైవర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తర్వాత గంటల పాటు ప్రయాణికులు ప్లాజా వద్ద ఉండిపోయారు. చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో డ్రైవర్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. జీఎంఆర్ పెట్రోలింగ్ సిబ్బంది తమ వాహనంలో డీజిల్ తీసుకొచ్చి ఫిలింగ్ చేశారు. దీంతో కథ సుఖాంతమైంది. తర్వాత బస్సు గమ్యస్థానానికి వెళ్లిపోయింది.