28-09-2025 08:59:43 PM
మందమర్రి (విజయక్రాంతి): సద్దుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని పట్టణంలోని మహిళలకు టీడీపీ నాయకులు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ ఇన్చార్జి బి సంజయ్ కుమార్ మహిళలకు చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంప్రదాయానికి అద్దం పడుతుందని, ప్రపంచంలో పూలను పూజించే పండుగ తెలంగాణలోనే ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టంగా భావించాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేద మహిళలకు దసరాకు చీరలు ఇవ్వాలనే సోయి కూడా లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు డ్వాక్రా గ్రూప్ సంఘాల మహిళలను ఆర్థికంగా ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధికి పునాదులు వేసిన గొప్ప నాయకుడని, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగుపడుతుందని మహిళలను పొదుపు సంఘాల ఏర్పాటు దిశగా ప్రోత్సహించారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్, నాయకులు జూపాక సంధ్య, జయ, సుకన్య, కవిత, సుగుణ, భాగ్య, కారం రాజు, ఓడ్నాల సత్యనారాయణ, శ్రీను, రాజేష్ లు పాల్గొన్నారు.