20-08-2025 07:23:37 PM
హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల పురోగతి, కేజీబీవీ పాఠశాల, స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి(District Additional Collector Venkat Reddy) బుధవారం తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో పలు రికార్డులను తనిఖీ చేసి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను గురించి వైద్యాధికారులు సిబ్బందిని అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి అడిగి తెలుసుకున్నారు.
ఎల్కతుర్తిలో పురోగతిలో ఉన్న పలువురు లబ్ధిదారులకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థినులకు వండిన భోజన పదార్థాలను పరిశీలించారు. విద్యార్థినులతో అదనపు కలెక్టర్ మాట్లాడి ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల గురించి తహసీల్దార్ ప్రసాద్ రావు ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రవిబాబు, పలు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.