26-10-2025 12:34:53 AM
రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన డీసీఓ
రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
మంచిర్యాల, అక్టోబర్ 25 (విజయక్రాం తి): మంచిర్యాల పట్టణంలోని ఇక్బాల్ అహ్మ ద్ నగర్లో ఉంటున్న జిల్లా సహకార అధికారి (డీసీఓ) రాథోడ్ భిక్కు నాయక్ ఒకరి వద్ద నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సంఘటన శనివారం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఏసీబీ డీఎస్పీ జీ మధు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. మంచిర్యాల జిల్లా కో ఆపరేటివ్ అధికారి రాథోడ్ బిక్కు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు ఇన్చార్జి డీసీఓగా విధులు నిర్వహిస్తున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ పీఏసీఎస్ సీఈఓ వెంకటేశ్వర్ గౌడ్ గతంలో సొసైటీ కలెక్షన్ సొంతానికి వాడుకున్న విషయంలో సస్పెండ్ అయ్యారు. సస్పెన్షన్ నుంచి తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడం కోసం, జీవో 44 ప్రకారం వేతన సవరణలు చేయడం, 2023, ఏప్రిల్ నుంచి ఫెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించడం, సస్పెన్షన్ కాలానికి జీతం మంజూరు, విచారణ నివేదికపై చర్యలు లేకుండా చూసేందుకు రాథోడ్ మొదట రూ. 7 లక్షలు లంచంగా డిమాండ్ చేయగా, రూ. 5 లక్షలకు ఒప్పుకున్నారు.
ఇందులో భాగంగా మొదటి విడత రూ. 2 లక్షలు మంచిర్యాలలో నివాసముంటున్న అద్దె ఇంట్లో వెంకటేశ్వర్ గౌడ్ నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బిక్కును కరీంనగర్లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పర్చనున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే నిర్భయంగా 1064 టోల్ ఫ్రీ నెంబర్ కుగాని, 9440446106 వాట్సప్కుగాని, 9154388963కి సమాచారం అందించాలని కోరారు.